
భారతీయ జర్నలిజానికి ఆద్యులు నారద మహాముని అని, ఆయన నుంచి సత్యనిష్ఠ, హితంగా చెప్పడం అన్న లక్షణాలను పాత్రికేయులు అలవర్చుకోవాలని సమాచార భారతి ఆధ్వర్యంలో శనివారం జరిగిన నారద జయంతి సందర్భంగా వక్తలు సూచించారు. ఓ పాత్రికేయుడికి వుండాల్సిన అన్ని లక్షణాలూ నారదునిలో వున్నాయని, అందుకే నారద జయంతిని జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. నారదుడు కలహప్రియుడు అంటూ లోకంలో ప్రచారంలో వుందని, ఇది శుద్ధ తప్పు అని వక్తలు పేర్కొన్నారు. కోఠిలోని YMIS భవనంలోని వీర సావర్కర్ హాలులో జరిగిన దేవర్షి నారద జయంతి కార్యక్రమానికి అధ్యక్షులుగా సమాచారభారతి అధ్యక్షులు ఆచార్య గోపాల్ రెడ్డి, ముఖ్య అతిథిగా IAAS (రిటైర్డ్) సి.హెచ్.వి. సాయిప్రసాద్, ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఏఎస్, విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్రం అధ్యక్షులు చామర్తి ఉమామహేశ్వర రావు హాజరయ్యారు.
నారద జయంతి సందర్భంగా మీడియా రంగంలో విశేష సేవలందించిన పలువురు పాత్రికేయులు, సీనియర్ కాలమిస్టులు, మీడియా నిపుణులకు సన్మానాలు చేశారు. సీనియర్ పాత్రికేయులైన కొరిడే మహేష్, గాండ్ల సంపత్, సీనియర్ కాలమిస్ట్ డాక్టర్ భాస్కరయోగి, ఓయు జర్నలిజం విభాగం అధ్యాపకురాలు డాక్టర్ కలువాయి అనిత, సీనియర్ వీడియోగ్రాఫర్ కర్ణటపు రాఘవేంద్రలను సమాచార భారతి తరఫున విశిష్ట సేవా పురస్కారాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా సభాధ్యక్షులు ఆచార్య గోపాల్ రెడ్డి మాట్లాడుతూ సమాచార భారతి మూడు దశాబ్దాలుగా పత్రికా రంగంపైనే ప్రధానంగా దృష్టి పెడుతోందని, వీటితో పాటు సామాజిక సమరసత, జాతి ఔన్నత్యం, సమగ్రతను పెంచడానికి మీడియా రంగాన్ని సాధనంగా చేసుకుంటోందని వివరించారు. నారద జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జర్నలిజంలో ఉత్తమ విలువలతో వున్న జాతీయ భావాలు గల పాత్రికేయులను సమాచార భారతి పక్షాన సన్మానిస్తున్నామని తెలిపారు. చాలా సంవత్సరాల పాటు విద్యలో భారతీయత అనేదే కనిపించేదే కాదని, కానీ గత 11 సంవత్సరాలుగా కొంత మార్పు కనిపిస్తోందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిందని, దీంతో విద్యా రంగంలో కొంత మార్పు వచ్చిందన్నారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన చామర్తి ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ ప్రస్తుతం ఫేక్ న్యూస్ విపరీతంగా వస్తోందని, దీనిని అరికట్టడానికి సమాచార భారతి కృషి చేయాలన్నారు. దేశహితం కాని వార్తలు కూడా వస్తున్నాయని, వాటికి కౌంటర్లు ఎలా ఇయ్యాలో కూడా ఆలోచించాలని, లేదంటే తప్పుడు కథనాలు సమాజంలో వ్యాప్తి చెందుతాయని హెచ్చరించారు. విద్యా భారతి ఈ పని కూడా చేస్తోందని, కౌంటర్ నెరేటివ్ను కూడా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. సమాజం ఎదగాలంటే భాగస్వాములందర్నీ కలుపుకుంటూ వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం పిల్లల్లో వివిధ మాధ్యమాల ద్వారా విష బీజాలను నాటుతున్నారని, ఆ విష బీజాలను ఎదుర్కోవాలన్నారు. దీని కోసం పుస్తకాలు, భారతీయ సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేయాలని సూచించారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన IAAS (రిటైర్డ్) సి.హెచ్.వి. సాయి ప్రసాద్ మాట్లాడుతూ నారదుడు త్రిలోక సంచారిగా వుంటూ, విషయాలన్నింటినీ సత్య నిష్ఠతో హితంగా చెబుతూ.. అన్ని వర్గాల వారికీ సమాచారాన్ని చేరవేశారన్నారు. సత్యనిష్ఠ, హితంగా చెప్పడం అన్న లక్షణాలతోనే కథన నిర్మాణాన్ని చేశారన్నారు. ఈ ఆదర్శాలను ఆధారంగా చేసుకుంటూ పాత్రికేయులు కూడా ఆదర్శ స్థితికి చేరాలని అభిలషించారు. మరోవైపు సమాజంలో ఎప్పుడూ నెగెటివ్ ఆలోచన అనేది వుండనే వుంటుందని, కానీ మనం మాత్రం మంచినే గ్రహించాలని అన్నారు. ఏఐ ద్వారా ప్రపంచనికి ముప్పు వుందని, కానీ దానిని వ్యతిరేకించలేమని, దానిలోని మంచినే స్వీకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆరెస్సెస్ దక్షిణ మధ్య క్షేత్రం ప్రచార ప్రముఖ్ నడింపల్లి ఆయుష్, తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్ కట్టా రాజగోపాల్తో పాటు సమాచార భారతి కార్యకర్తలు, పాత్రికేయులు పాల్గొన్నారు.
More Stories
భాగ్యనగర్ సోషల్ మీడియా సంగమం – సంఘటనా స్ఫూర్తికి ప్రతిబింబం
జాతీయవాదంతో ప్రతిబింబించిన సోషల్ మీడియా సంగమం
స్ఫూర్తిదాయకంగా గాజుల లక్ష్మీ నరసు చెట్టి పుస్తకావిష్కరణ