- ఈ నెల 30న నీటి విడుదల
- నది పుట్టిన చోట డ్యాం నిర్మాణం
- హరియాణా ప్రభుత్వం నిర్ణయం
సరస్వతీ నది! రుగ్వేదంలో పేర్కొన్న పుణ్య నది! వేద కాలంలో ప్రజలు ఈ నదీతీరంలోనే జీవించారని కూడా చెబుతూ ఉంటారు! రుగ్వేదం నుంచి మహా భారతం వరకూ పురాణ ఇతిహాసాల్లో ఈ నది ప్రస్తావన ఉంటుంది. సరస్వతీ నది ఎడారిగా మారిపోయిందని మహా భారతంలోనే పేర్కొన్నారు. ఇప్పుడు ఈ నదిని పునరుద్ధరించాలని హరియాణా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.10.5 కోట్లను మంజూరు చేసింది. ఈ నెల చివర్లోనే ఈ నదీ మార్గంలో నీళ్లు వదలడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందుకు సన్నాహాలు కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.
హరియాణాలోని దాదుపూర్ ఫీడర్ ద్వారా ఈనెల 30వ తేదీన ఉంచా చందన గ్రామం నుంచి నదీ మార్గంలోకి నీటిని వదలాలన్న ప్రతిపాదనకు సరస్వతీ హెరిటేజ్ డెవలప్ మెంట్ బోర్డు (ఎస్హెచ్డీబీ) ఇప్పటికే ఆమోదించింది. సరస్వతీ నది రాజస్థాన్ వరకూ ప్రయాణించిందని చారిత్రక ఆధారాలు ఉన్నాయని, దీనిని ఇస్రో కూడా గుర్తించిందని ఎస్హెచ్డీబీ ఉపాధ్యక్షుడు ప్రశాంత భరద్వాజ్ చెప్పారు. యమునానగర్, కురుక్షేత్ర, కైథాల్ జిల్లాల ద్వారా ఈ నీరు ప్రవహించనుంది. ప్రస్తుతం దాదుపూర్ ఫీడర్ను శుభ్రం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఒకసారి కనక నది ప్రవహించడం మొదలైతే, ఆ తర్వాత వర్షాలతో నీటి ప్రవాహం పెరుగుతుందని భావిస్తున్నారు. ఇక, సరస్వతీ నదిని పునరుద్ధరించాలనే దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా, నది పుట్టిందని భావిస్తున్న ఆది బద్రి వద్ద డ్యాం నిర్మించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఈ నది పునరుద్ధరణలో 69 సంస్థలు భాగస్వామ్యం పంచుకుంటున్నాయి. ఐఐటీతో కన్సార్షియం ఏర్పాటుకు కూడా చర్చలు సాగుతున్నాయి.
ఇక, యమునా నగర్లో ఆరు, ఆది బద్రి, ముగాల్వలీల్లో రెండు చొప్పున బోర్ వెల్స్ ఏర్పాటు చేయనున్నారు. హిందువుల ఆత్మను సజీవంగా ఉంచాలనే ప్రయత్నాల్లో భాగంగానే అంతర్దానం అయిపోయిన సరస్వతీ నదిని పునరుద్ధరించాలని భావిస్తున్నామని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వ్యాఖ్యానించారు. నిజానికి, సరస్వతీ నదిని గుర్తించి పునరుద్ధరించాలని 2002లో వాజపేయి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. కానీ, యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు దీనిని రద్దు చేసింది. మళ్లీ కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుమయూన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కేఎస్ వాల్దియా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి, సరస్వతీ నదిని గుర్తించాలని నిర్దేశించింది.
(ఆంధ్ర జ్యోతి సౌజన్యం తో )
More Stories
లోక కళ్యాణమే ధ్యేయంగా పాత్రికేయులు పని చెయ్యాలి – ప్రఫుల్ల కేత్కర్
సమాచార భారతి తెలంగాణ ఆధ్వర్యంలో ”సోషల్ మీడియా సంగమం 2023”
Bharath achieving great milestones in Atma-nirbharta in Defence sector – Dr G.N.Rao.