Narada Jayanti – 2014

నారద జయంతి ఉత్సవంలో వేదికపై వందేమాతరం గీతాలాపన చేస్తున్న శ్రీ బి.ఎస్.శర్మ, వేదికనలంకరించిన పెద్దలు ఎడమ నుండి కుడికి వరుసగా శ్రీ బి.నరసింహమూర్తి, శ్రీ శైలేష్ రెడ్డి, శ్రీ ఎం.వి.ఆర్.శాస్త్రి, శ్రీ జి.వల్లీశ్వర్, శ్రీ దిలీప్ రెడ్డి, శ్రీ సుధీర్ కుమార్
FacebookTwitter

నారద జయంతి ఉత్సవంలో వేదికపై వందేమాతరం గీతాలాపన చేస్తున్న శ్రీ  బి.ఎస్.శర్మ, వేదికనలంకరించిన పెద్దలు ఎడమ నుండి కుడికి వరుసగా  శ్రీ బి.నరసింహమూర్తి, శ్రీ శైలేష్ రెడ్డి, శ్రీ ఎం.వి.ఆర్.శాస్త్రి, శ్రీ జి.వల్లీశ్వర్, శ్రీ దిలీప్ రెడ్డి, శ్రీ సుధీర్ కుమార్

‘స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలో ముఖ్యమైన రంగాల అభివృద్ధికి ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాం. స్వాతంత్ర్యం వచ్చిన తొలిరోజుల్లో మీడియాలో పనిచేసే అందరిలో దేశభక్తి ఉండేది. దేశంలో జరుగుతున్న పరిణామాలను సానుకూల దృక్పథంతో ప్రజలకు తెలియచేసేవారు. ఎమర్జెన్సీ విధించినప్పడు సమాజానికి జరిగిన అన్యాయాన్ని జర్నలిస్టులు ఎత్తిచూపారు. దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించే దిశగా జర్నలిస్టులు తమవంతు కర్తవ్యాన్ని నిర్వహించాలి’ అని ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక సంపాదకులు జి.వల్లీశ్వర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లోని తెలుగు అకాడమీలో జూన్ 2014న సమాచార భారతి ఆధ్వర్యంలో జరిగిన నారద జయంతి కార్యక్రమానికి వల్లీశ్వర్ అధ్యక్షత వహించారు.

సమాచార భారతి ప్రతి సంవత్సరం నారద జయంతిని పాత్రికేయ దినోత్సవంగా నిర్వహిస్తూ వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శించిన యువ జర్నలిస్టులను సత్కరిస్తున్నది. ఈ సందర్భంగా ‘ప్రస్తుత పరిస్థితులలో మీడియా పాత్ర’ అనే అంశంపై సదస్సు నిర్వహించింది. హైదరాబాద్ నగరంలోని వివిధ టెలివిజన్ ఛానళ్ళు, దిన, వార పత్రికలలో పనిచేస్తున్న అనేకమంది జర్నలిస్టులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకులు ఎం.వి.ఆర్.శాస్త్రి కీలకోపన్యాసం చేశారు. గత సంవత్సరం వివేకానంద 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ లోని మారియట్ హోటల్ లో సమాచార భారతి నిర్వహించిన సమ్మేళనంలో యువ జర్నలిస్టులు పాల్గొని దేశం గురించి ప్రసంగిస్తూ ప్రగతి కోసం పనిచేస్తామంటూ వ్యక్తం చేసిన అభిప్రాయాల పట్ల ఎం.వి.ఆర్.శాస్త్రి సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ భావాలు గల జర్నలిస్టులు తరచు కలుస్తూ అభిప్రాయాలు పంచుకోవడం వల్ల సమాజానికి మేలు జరుగుతుందన్నారు. “నారదుడు, సంజయుడు మనకు తెలిసిన తొలి జర్నలిస్టులు. సంజయుడు తాను చూసిన దానిని యథాతథంగా కురువంశ రాజు ధృతరాష్ట్రునికి నివేదించేవాడు. త్రిలోక సంచారి అయిన నారదుడు ముల్లోకాలు తిరుగుతూ అక్కడి వార్తలు ఇక్కడ, ఇక్కడి వార్తలను అక్కడ చేరవేసేవాడు. అయితే నారదుని లక్ష్యం అంతా లోకకళ్యాణమే. సమాజ హితమే. సినిమాలలో నారదుడిని కలహభోజనుడిగా, జోకర్ గా చూపిస్తున్నారు. అది తప్పు. నారదుని మాదిరిగానే జర్నలిస్టులమైన మనం కూడా రాక్షసుల మధ్య తిరుగుతున్నాం. తగవులు పెడుతున్నాం. అయితే ప్రతి జర్నలిస్టు నారదుని మాదిరిగా సమాజహితమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తే దేశం బాగుపడుతుంది. ‘సమాజాన్ని అర్థం చేసుకోవడంలో, అంచనా వేయడంలో జర్నలిస్టులు ఎప్పుడూ విఫలమవుతున్నారు. 1977లో శ్రీమతి ఇందిరాగాంధీ అఖండ విజయం సాధిస్తారని పత్రికలన్నీ రాసాయి. అక్కడి నుండి ప్రతి ఎన్నికలోనూ జర్నలిస్టుల అంచనాలు తల్లక్రిందులవుతున్నాయి. ప్రజల నాడిని పసిగట్టడంలో జర్నలిస్టులు విఫలమవుతున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని అంచనా వేసినా, ఏన్డీయేకు మెజారిటీ రాదని అన్ని పత్రికలు, టి.వి.ఛానెళ్ళు కోడై కూసాయి. ప్రాంతీయ పార్టీల నేతలే కొత్తగా ఏర్పడే ప్రభుత్వాన్ని శాసిస్తారని జర్నలిస్టులు కథనాలు రాసారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ప్రజలు విజ్ఞులు. తమకు కావాల్సింది ఏమిటో వారికి తెలుసు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు మంచి మెజారిటీతో గెలిచినా ఐదేళ్ళ తరువాత ప్రజలు వారిని తిరస్కరించారు.

‘ఇదం బ్రహ్మం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి’
అన్న చందంగా సమాజ పునర్నిర్మాణానికి కృషి జరగాలి. వందల ఏళ్ళు దేశం కోసం కృషి చేసిన మహాత్ముల కలలు మొన్నటి ఎన్నికల్లో ప్రస్ఫుటమయ్యాయి. జర్నలిస్టులు కుహనా లౌకిక వాదుల ప్రభావానికి లోను కాకుండా సమాజహితం కోసం పనిచేయాలి’ అని ఎం.వి.ఆర్.శాస్త్రి పిలుపునిచ్చారు.

సాక్షి దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి మాట్లాడుతూ…“పాత్రికేయం అనేది సమాజంలో మంచికో, చెడుకో కారణమవుతుంది. మంచి అనేది ఎప్పడూ ఉంటుంది. నేను ఆశావాదిని. మనం సానుకూల దృక్పథంతో ఆలోచిద్దాం. యాజమాన్యాలకు తమదైన ప్రయోజనాలు ఉన్నాయి. సంపాదకుల ఇష్టాయిష్టాలకు అతీతంగా జర్నలిస్టులు పనిచేయవచ్చునని నారదుడు నిరూపించాడు” అని అన్నారు.

ప్రముఖ రచయిత స్వర్గీయ భండారు సదాశివరావు స్మారక పురస్కారాన్ని శ్రీ ఉల్చాల హరిప్రసాద్ రెడ్డి (ఈనాడు), శ్రీ వాసుదేవన్ (ఎక్స్ ప్రెస్ టివి) లకు ప్రదానం చేశారు. అలాగే స్వర్గీయ వడ్లమూడి రామ్ మోహనరావు పురస్కారాన్ని శ్రీ గోపీయాదవ్ (టివి-9), శ్రీమతి సునంద (వి-6) లకు ప్రదానం చేశారు. అందరికీ శాలువా కప్పి సన్మానం చేశారు.  
స్టూడియో ఎన్ టెలివిజన్ డైరెక్టర్ శైలేష్ రెడ్డి మాట్లాడుతూ..“నారద జయంతి సందర్భంగా మనం అంతర్మథనం చేసుకోవాలి. దేశంలో మార్పులు సంభవిస్తున్నాయి. పత్రికల రిపోర్టింగ్ లో కూడా మార్పలు వస్తున్నాయి. ప్రజల అభిరుచులు, ప్రాథమ్యాలు మారుతున్నాయి. సమాజంలో జరుగుతున్న మార్పులపై జర్నలిస్టులు స్పందించాలి. జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా, జపాన్ వంటి దేశాల మాదిరిగా మనం ఎందుకు అభివృద్ధి చెందడం లేదో ఆలోచించాలి” అని సూచించారు.

తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిజం విభాగం అధిపతి అయిన సుధీర్ కుమార్ మాట్లాడుతూ…“జర్నలిస్టులు తమ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలి. సమాజానికి ఏది మంచి చేస్తుందో, ఏది చెడు చేస్తుందో ఆలోచించి కాపాడుకొంటూ సమాజ వికాసానికి కృషి చేయాలి” అని అన్నారు.

ప్రముఖ రచయిత స్వర్గీయ భండారు సదాశివరావు స్మారక పురస్కారాన్ని శ్రీ ఉల్చాల హరిప్రసాద్ రెడ్డి (ఈనాడు), శ్రీ వాసుదేవన్ (ఎక్స్ ప్రెస్ టివి) లకు ప్రదానం చేశారు. అలాగే స్వర్గీయ వడ్లమూడి రామ్ మోహనరావు పురస్కారాన్ని శ్రీ గోపీయాదవ్ (టివి-9), శ్రీమతి సునంద (వి-6) లకు ప్రదానం చేశారు. అందరికీ శాలువా కప్పి సన్మానం చేశారు.

పురస్కార గ్రహీతలు వరుసగా శ్రీ హరిప్రసాద్ రెడ్డి, శ్రీ వాసుదేవన్, శ్రీ గోపియాదవ్, శ్రీమతి సునంద
కార్యక్రమంలో వరిష్ట పాత్రికేయులు శ్రీ వరదాచారి, సమాచార భారతి ఉపాధ్యక్షులు శ్రీ బి.నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. భోజనంతో కార్యక్రమం ముగిసింది.

– వేదుల
FacebookTwitter